Yathra

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, ఆలయం — శ్రీనివాస మంగాపురం.

శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో తిరుపతి, మదనపల్లి రోడ్డులో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.

ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు.

ప్రత్యేకత:.
****
పెళ్ళికాని వారికి కళ్యాణ కంకణాలు కట్టే వేంకటేశ్వరుడు

పెళ్ళికాని వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వీరిలో పెళ్లి కావాలని కోరుకుని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని… గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాల్లోపు పెళ్లిళ్లుల జరుగుతాయని భక్తుల విశ్వాసం.

నిన్నమొన్నటి వరకు చిత్తూరు, తిరుపతి జిల్లాలోని ప్రజలే కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎక్కవుగా వచ్చేవారు. అయితే ఈ నమ్మకం ఆ నోట…ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో అందరికీ తెలియడంతో… ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు.

భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నవెంటనే పెళ్లికాని అమ్మాయిలకు.. అబ్బాయిలకు వెంటనే పెళ్లిళ్లు జరగడంతో స్వామి వారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది. తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.

వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతోన్న అమ్మాయిలు, అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ప్రతీ రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు ఎగబడుతున్నారు. వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన అబ్బాయిలు, అమ్మాయిలు… జంటలుగా స్వామి వారి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఇక స్థలప్రాశస్త్యం వివరాల్లోకి వెళితే… పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమల గిరులకు ఈమార్గం గుండా వెళ్తుంటే… నూతన వధూవరులు గిరుల పర్యటన చేయకూడదని అగస్త్యమహాముని సూచించారని… దాంతో శ్రీవారు శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు పాటు ఉండిపోయారన్నది పురాణప్రాశస్త్యం. ఈ కారణంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రాను సారం ఎలాంటి పూజలు, కైంకర్యాలు జరుగుతాయో శ్రీనివాస మంగాపురంలోను అదే తరహాలో పూజా కైంకర్యాలు జరుగుతాయి.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యశీస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుంటూ

ఓం నమో వేంకటేశాయ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *