21 రోజులు దేశమంతా పూర్తిగా లాక్ డౌన్..
.-మోడీ సంచలన ప్రకటన
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇవాళ(మార్చి-24,2020)దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఇవాళ రాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షించడానికే ఈ నిర్ణయం అని మోడీ తెలిపారు. జనతా కర్ఫ్యూ కన్నా ఎక్కువ ఆంక్షలు ఉంటాయన్నారు.
21 రోజులు పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. ఇది కర్ఫ్యూ లాంటిదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలన్నారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని మోడీ కోరారు. తాను ప్రధానమంత్రిగా ఈ నిర్ణయం ప్రకటించడం లేదని,ఓ కుటుంబసభ్యుడిగా చెబుతున్నానన్నారు.
రాబోయే 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ ను మనం నిర్వహించలేకపోతే…21ఏళ్ల వెనక్కి మనం శిక్షించబడతామని అన్నారు. వచ్చే 21 రోజులు మనకు చాలా కీలకం అన్నారు. ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. 21 రోజుల్లో కరోనాను నియంత్రించకుంటే చాలా కుటుంబాలు కనుమరుగవుతాయన్నారు. ఇవాళ అర్థరాత్రి 12గంటల నుంచి లాక్ డౌన్ ప్రారంభమవుతుందన్నారు. లాక్ డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికీ లక్ష్మణ రేఖ అని మోడీ తెలిపారు.